మొగల్ వైభవానికి చిహ్నం చంపా

గురువారం, 10 ఏప్రియల్ 2008 (14:55 IST)
అందమైన కొండలను తన ఒడిలో చేర్చుకున్నట్టుగా ఉండే చంపా పర్వత శ్రేణులు హిమాచల్ ప్రదేశ్‌‌లోని చంపా జిల్లాలో ఉన్నాయి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వర్మ తన కుమార్తె పేరును ఈ పర్వతాలకు పెట్టాడట. ఇక్కడికి 56 కి.మీలలోనే ఉంది డల్‌హౌసీ అనే మరో పర్వత ప్రాంతం. ఇది ఢిల్లీకి 600 కి.మీ దూరంలో ఉంది.

మొదట్లో మొగలుల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం తర్వాత సిక్కుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత బ్రిటీష్ వారు దీనిని స్వాధీనం చేసుకున్నారు. కాలక్రమేణా ఇది హిమాచల్ ప్రదేశ్‌లో కలిసిపోయింది. ఈ ప్రాంతం అద్భుతమైన ఆలయ శిల్పకళకు పేరు గాంచింది. అంతే కాకుండా వివిధ రకాల ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

చంపాలో ప్రఖ్యాతి గాంచిన లక్ష్మీనారాయణ ఆలయం ఉంది. పరమశివుడు, విష్ణువులకు కలిపి మొత్తం ఆరు ఆలయాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన ఆలయం బ్రజేశ్వరి దేవీ ఆలయం. దుర్గాదేవి కొలువైన ఈ ఆలయంలో ఉన్న షికారా పద్ధతి చూపరులను ఆకర్షిస్తుంది.

ఇక్కడి మరో ఆకర్షణీయాంశం చంపాదేవి వెలసిన సూయ్ మాతా ఆలయం. అక్కడి ప్రజల దేవత అయిన చంపాదేవి తన రాజ్యంలోని ప్రజల కోసం ప్రాణాలు విడిచిందని స్థానికులు చెబుతుంటారు. అలాగే ఇక్కడ ఉన్న భురీ సింగ్ మ్యూజియంలో ఈ ప్రాంతానికి సంబంధించిన బసోహ్లీ, కాంగ్రా పద్ధతి పెయింటింగ్స్‌ను చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మార్చ్ నుంచి జూన్ వరకు అనువైన కాలం.

వెబ్దునియా పై చదవండి