గురువారం ఉదయం ఏడు గంటలకు దేశవ్యాప్తంగా దాదాపు 20 అసెంబ్లీలకు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. దీంతో దేశంలోని అన్నీ ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షే! లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే ఎన్నికలను అన్నీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
దేశంలోని ఏడు రాష్ట్రాలలో 20 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. వాటిలో బీహార్ రాష్ట్రంలో 7, గుజరాత్ రాష్ట్రంలో 7 స్థానాలు ఉన్నాయి. గత నెలలో 17 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
గురువారం జరుగుతున్న ఎన్నికల్లో చాలా మంది లోక్సభకు ఎన్నికకావడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 14న వెల్లడికానున్నాయి.
ఈ ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని టెక్కలితో పాటు మధ్యప్రదేశ్లో రెండు, సిక్కిం, ఉత్తరాఖండ్, ఢిల్లీ (ద్వారకా)లలో జరుగుతున్నాయి. బీహార్లోని అన్నీ స్థానాలకు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారానే జరుగుతున్నాయి.
ఈ సారి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ హైకోర్టు జశ్వంత్ సింగ్ పుస్తకంపై బహిష్కరణ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇష్రాత్జహాన్ ఎన్కౌంటర్ నకిలీ ఎన్కౌంటర్ అని సెషన్స్కోర్టు తీర్పు ఇవ్వడం ఇవన్నీ బీజేపీ కలసిరాని అంశాలని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. పాట్నాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకున్నామని అదనపు డైరెక్టర్ జనరల్ విలేకరులకు తెలిపారు.