అహ్మదాబాద్‌లో ఢిల్లీ తరహా పేలుళ్లు: ఈ-మెయిల్‌లో బెదిరింపులు

ఢిల్లీ హైకోర్టు తరహా అహ్మదాబాద్‌లో విధ్వంసం సృష్టించబోనున్నట్లు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. గుజరాత్ రాజధాని నగరం అహ్మదాబాద్‌లో ఢిల్లీ తరహా పేలుళ్లతో విధ్వంసం సృష్టించనున్నట్లు బెదిరింపులు రావడంతో భద్రతను పటిష్టం చేశారు.

ఢిల్లీ హైకోర్టుకు వెలుపల జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు హూజీ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించిన నేపథ్యంలో, జమ్మూ నుంచి పంపబడిన ఈ-మెయిల్‌పై పోలీసులు ముగ్గురి వద్ద విచారణ జరుపుతున్నారు.

పశ్చిమబెంగాల్, ఢిల్లీ షాపింగ్ మాల్ వంటి ప్రాంతాల్లోనూ బాంబు పేలుళ్లు జరుపుతామని ఇప్పటికే హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం అహ్మదాబాద్‌లోనూ దాడులు జరుపుతామనే బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ వారణాసి, బెలా గ్రామానికి చెందిన వారని తెలిసింది. వీరివద్ద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి