ఆంధ్ర-కర్ణాటకలో వరదలు: 197కు చేరుకున్న మృతులు

బుధవారం, 7 అక్టోబరు 2009 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సంభవించిన వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 250కు చేరుకుంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే మృతుల సంఖ్య 197గా ఉన్నట్టు ఆ రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి.

ఉత్తర కన్నడ జిల్లాలతో పాటు.. చిక్కబల్లాపుర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్నది. ఫలితంగా అపార నష్టం వాటిల్లింది.

ఉత్తర కర్ణాటకలో మొత్తం 281315 గృహాలు కూలిపోవడం లేదా దెబ్బతినడం జరిగిందన్నారు. అలాగే, 1469 గ్రామాలు వరద నీటి బారిన పడినట్టు వివరించారు. సుమారు 617633 మంది వర్ష బాధితులు 1619 రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

వరద బారిన మరో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి మెరుగవుతోంది. వరద బారిన పడి మృతి చెందిన వారి లెక్కలు మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు ఐదు జిల్లాల్లో 55 మంది మరణించినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి