ఆగస్టు 5వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!

మంగళవారం, 16 జులై 2013 (11:40 IST)
File
FILE
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతారా లేదా అనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

కానీ, కొన్ని ప్రాంతీయ పత్రికలు ప్రచురించిన కథనాల మేరకు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సమావేశాల ప్రారంభానికి ముందే భేటీ అయి తెలంగాణ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోవచ్చని లేదా ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థిక మండళ్ళ ఏర్పాటు వంటి అంశాలపై దృష్టిసారించవచ్చని పేర్కొంటున్నాయి.

ఇదిలావుండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఆగస్టు 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. 26 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సోమవారం నిర్ణయించింది.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తున్న ఆహార భద్రత ఆర్డినెన్స్‌తో పాటు భూసేకరణ, బీమా తదితర రంగాలకు సంబంధించిన ప్రధాన ఆర్థిక బిల్లులను ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.

ఆహార భద్రత బిల్లును అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం విదితమే. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అలాగే, తెలంగాణ అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి