మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ విపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు ఒక విన్నపం చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక చాలు ఆపేయండంటూ ఆయన విన్నవించారు. అంతటితో ఆగని గౌడ.. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యులపై ఉందని హితవు పలికారు.
విపక్షాలు చేస్తున్న జేపీసీ డిమాండ్పై ఆయన గురువారం బెంగుళూరులో స్పందిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ సభ్యులు చేస్తున్న ప్రకటనలు వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా సజావుగా సాగేలా కనిపించడం లేదు. దీనికి తాను పూర్తి వ్యతిరేకం. జరిగిందేదో జరిగిపోయిందన్నారు.
అంతేకాకుండా స్వతంత్ర భారతావనిలో 2జి స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని ఒక మెగా స్కామ్గా ఆయన అభివర్ణించారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు ఎన్డీయే యేతర పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. అయితే వచ్చే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయరాదన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ప్రతి సమావేశాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ పోతే, ఇక పార్లమెంట్ ఎందుకు అని గౌడ ప్రశ్నించారు.