ఎన్నికలకు సన్నద్ధం కావాలి: సౌజ్ పిలుపు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కేంద్ర జలవనరుల శాఖామంత్రి సైపుద్ధీన్ సౌజ్ పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన సౌజ్.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు.

దీనిపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు జిల్లా, బ్లాకు స్థాయిల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.

అంతేకాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టే ప్రచారంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఏర్పాటు చేసిన కమిటీలను మరింత విస్తృత పరిచి, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని మంత్రి సౌజ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి