కార్తీక పౌర్ణమి తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోతుందా..? కలిసే ఉంటుందా..?

మంగళవారం, 8 నవంబరు 2011 (19:59 IST)
FILE
రాష్ట్రంలో గత రెండేళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యకు చరమ గీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించినట్లు కనబడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ మాటలే ఇందుకు నిదర్శనం.

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆజాద్ ఢిల్లీలో జాతీయ మీడియాతో అన్నారు. పౌర్ణమి తర్వాత ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణపై ప్రకటన పార్టీ పరంగా ఉండదనీ, ప్రభుత్వమే చేస్తుందని చెప్పుకొచ్చారు.

గతంలో తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారనీ, మళ్లీ ఆయనే తెలంగాణపై ఓ ప్రకటన చేస్తారని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ అధిష్టానంతో కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు.

ఇదిలావుంటే యూపీఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో మంగళవారంనాడు ఆజాద్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో తెలంగాణపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి పౌర్ణమి తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోతుందా..? లేదంటే కలిసే ఉంటుందా..? వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి