గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

సోమవారం, 10 డిశెంబరు 2007 (17:29 IST)
తొలి విడత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 87 శాసన సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలను చేపట్టింది. కీలకమైన ప్రాంతాలలో పారా మిలటరీ దళాలను మోహరింపచేశారు. అన్ని పోలీంగ్ కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ జరుపవలసిందిగా సంబంధిత అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

కేవలం సౌరాష్ట్ర ప్రాంతంలోనే 58 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్న తరుణంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకున్నారు.

రాజ్‌కోట్ జిల్లాలో 58 కంపెనీల పారామిలటరీ దళాలను, జామ్‌నగర్ జిల్లాలో 47 కంపెనీలను, సురేంద్రనగర్ జిల్లాలో 38 కంపెనీలను అలాగే పోరుబందర్ జిల్లాలో 12 కంపెనీలను మోహరింపచేశారు. అంధుల సౌకర్యార్ధం తొలిసారిగా బ్రెయిలీ ఆధారిత ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి