జడ్జిల బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం

న్యాయమూర్తుల ఆస్తులపై రూపొందించిన వివాదాస్పద బిల్లు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం వెనుకడుగువేసింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవడంతో పాలకపక్షం దానిని వెనక్కు తీసుకోకతప్పలేదు.

ఈ ప్రతిపాదిత బిల్లు న్యాయమూర్తులు వారి ఆస్తులను బహిరంగంగా వెల్లడించకుండా రక్షణ కల్పిస్తుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి. దీంతో యూపీఏ సర్కారుకు పార్లమెంట్‌లో తొలి షాక్ తగిలింది. ఫలితంగా న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడికి సంబంధించిన ఈ వివాదాస్పద బిల్లును రాజ్యసభ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఏకాభిప్రాయం సాధించిన తరువాత బిల్లును మళ్లీ తెస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సిద్ధాంతపరంగా బద్ధశత్రువులైన లెఫ్ట్, బీజేపీలు ఈ బిల్లు విషయంలో ఏకతాటిపై నిలిచి పోరాడటం సోమవారం రాజ్యసభలో చోటుచేసుకున్న ఓ అరుదైన పరిణామం. న్యాయమూర్తులు ఆస్తుల వివరాలు వెల్లడించకుండా బిల్లులో రక్షణ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

ఈ ఆరోపణలకు కాంగ్రెస్ సభ్యురాలు జయంతి నటరాజన్ కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. బిల్లుపై ఏకాభిప్రాయం సాధించిన తరువాత తిరిగి తీసుకొస్తామని ఈ సందర్భంగా న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాజ్యసభకు తెలియజేశారు. ఈ బిల్లుకు సభలో ఆమెదం లభించాలంటే ఏకాభిప్రాయం సాధించడమొక్కటే యూపీఏకి ఉన్న మార్గం.

వెబ్దునియా పై చదవండి