విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టిన నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జులై 28న విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పరిశీలించింది.
ఈ అంశంపై జులై 28న విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులేమీ జారీ చేయలేదు. ఈ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్కు ప్రత్యుత్తరమిచ్చేందుకు పిటిషనర్లు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ, మరో ఐదుగురిని సుప్రీంకోర్టు అనుమతించింది.
పిటిషనర్లకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సోమవారం పిటిషనర్లు రాతపూర్వక స్పందనలు తెలియజేశారు. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంలో జాప్యం చేసిందని పిటిషనర్లు తమ స్పందనలలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పిటిషనర్ల రాతపూర్వక వివరణపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది.