తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: దిగ్విజయ్ సింగ్ స్పష్టం

FILE
సీడబ్ల్యూసీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆయన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలన్నారు. సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీ విధేయుడని, ఆయనతో తాను మాట్లాడుతానని భరోసా ఇచ్చారు.

విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కరించుకునేందుకే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని తెలిపారు. అన్ని సమస్యలను ఆంటోనీ కమిటీ పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆంటోనీ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి