దేశ రాజధానిలో మహిళామణులకు రక్షణ శూన్యం!

మంగళవారం, 1 డిశెంబరు 2009 (12:02 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో నివశించే మహిళలకు భద్రత కరువైంది. ఇక్కడ నివశించే నారీమణులు ఏదో విధంగా అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. మహిళలను వివిధ రకాలుగా వేధించినందుకు ఇప్పటి వరకు 1200 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలే హస్తినలో మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అయితే, పోలీసులు మాత్రం ఈ గణాంకాలతో ఏకీభవించడం లేదు. మహిళలకు భద్రత బాగానే కల్పిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు.

మహిళలకు వ్యతిరేకంగా నమోదైన 1240 కేసుల్లో హత్యలు, అత్యాచారాలు, హింస, దౌర్జన్య, ఈవ్‌టీజింగ్స్ కేసులు ఉన్నాయి. అయితే, గత యేడాది తొలి 11 నెలలతో పోల్చితే ఈ సంఖ్య 12 శాతం మేరకు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఢిల్లీ పోలీసుల లెక్కల ప్రకారం ఈ యేడాది తొలి 11 నెలల్లో 414 రేప్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 222 ఈవ్ టీజింగ్ కేసులు, 492 హింస (వేధింపు) కేసులు, 112 హత్యా కేసులు నమోదయ్యాయి. గత యేడాది ఇదే సమయానికి 1402 కేసులు నమోదైనట్టు రికార్డులు చెపుతున్నాయి.

అయితే, హస్తినలో హత్యకు గురవుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలుపుతుండగా, ఇతర రకాల కేసుల సంఖ్య తగ్గింది. గత యేడాది 108 మంది మహిళలు హత్యకు గురికాగా, ఈ యేడాది నవంబరు వరకు 112 మంది హత్యకు గురయ్యారు.

అలాగే, నమోదైన 414 రేప్ కేసుల్లో 57 కేసులు గ్యాంగ్ రేపులు కాగా, 357 కేసులు సింగిల్ మెన్ రేప్ కేసులని పోలీసులు చెపుతున్నారు. మొత్తం నమోదైన 440 రేప్ కేసుల్లో 60 గ్యాంగ్ రేపులు కాగా, 380 సింగిల్ మెన్ రేప్ కేసులని పోలీసులు వివరించారు.

అలాగే, హింసా కేసులు తగ్గాయి. గత యేడాది 558 కేసులు నమోదు కాగా, ఈయేడాది 64 కేసులు తగ్గాయి. అలాగే, 2008లో 296 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, ఈ దఫా 222 కేసులు నమోదైనట్టు పోలీసు గణాంకాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి