నేటి నుంచి నాగా వేర్పాటువాదులతో కేంద్రం చర్చలు!

మంగళవారం, 2 మార్చి 2010 (11:32 IST)
ఆరు దశాబ్దాలుగా పరిష్కారం లభించని అఖండ నాగాలాండ్ ఏర్పాటు డిమాండ్‌ పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అఖండ నాగాలాండ్ ఉద్యమ నేతలతో కేంద్రం మంగళవారం నుంచి చర్చలు జరుపనుంది. గత ఆరు దశాబ్దాలుగా మిన్నకుండిని కేంద్రం ఈ దఫా మాత్రం ఉద్యమకారులను చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.

అఖండ నాగాలాండ్ ఏర్పాటుతో పాటు.. నాగాలాండ్‌కు సార్వభౌమాధికారం కల్పించాలన్నది ఉద్యమకారుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నాగా ఉద్యమ సంస్థ ఎన్ఎస్‌సీఎన్-ఐఎం నేతలు తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం చర్చలు జరుగనున్నాయి.

తమ కీలకమైన సర్వసత్తాకతపై రాజీ లేదని నాగా సంస్థ ప్రకటించగా, అది తప్ప మిగిలిన అంశాలపై చర్చించుకోవచ్చునని కేంద్రం హోంశాఖ కార్యదర్శి జీకే.పిళ్లై స్పష్టం చేశారు. ఇంతకాలం ప్రవాసంలో ఉన్న ఎన్ఎస్‌సీఎన్ ప్రధాన కార్యదర్శి ముయివా చర్చల కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

కాగా, నాగాలాండ్ ఉద్యమకారుల డిమాండ్‌లపై మద్యవర్తి ఆర్ఎస్.పాండే చేసిన కృషి ఫలితంగా కేంద్రం చర్చలకు అంగీకరించింది. ప్రధాని మన్మోహన్ సిగ్, హోం మంత్రి చిదంబరంతో ముయివా చర్చలు జరుపనున్నారు. ఆ తరువాత ఆయన నాగాలాండ్‌లో పర్యటించి ఇటీవలి కాలంలో నాగా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను సమీక్షించనున్నారు.

వెబ్దునియా పై చదవండి