ప్రజలతో గడపడమే ఆయనకు ఇష్టం: గోకుల్ బైరాగి

ఆదివారం, 17 జనవరి 2010 (17:54 IST)
FILE
దివంగత నేత, కమ్యూనిస్టు యోధుడు, మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా, సాధారణ కార్యకర్తగా వ్యవహరించే వారని, ఎల్లప్పుడూ ప్రజలతో గడపడమే ఆయనకు చాలా ఇష్టంగా ఉండేదని ఆయన దగ్గర ఎలక్షన్ ఏజెంట్‌‍గా వ్యవహరించిన గోకుల్ బైరాగి అన్నారు.

బసు మృతి చెందారన్న వార్త వినగానే గోకుల్ కళ్ళనీళ్ళపర్యంతమైనాడు. ఆయనతో తను గడిపిన మధుర స్మృతులను మననం చేసుకుంటు మీడియాకు వెల్లడించాడు. తమ ఆరాధ్యదైవం, ఆప్యాయతలు పంచే నేత గదిలో తలుపులు మూసుకుని చర్చలు జరపడం కన్నా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల మధ్య ఉండడానికే ఇష్టపడేవారని గోకుల్‌ అన్నారు.

తాను 1982 నుంచీ జ్యోతిబసు దగ్గర ఏజెంటుగా ఉన్నానని బైరాగి తెలిపారు. ఆయనకు వందలాది ప్రజలనుద్దేశించి మాట్లాడడమే చాలా ఇష్టమని చెప్పారు. వీధి చివర పదిమంది చేరినా చాలు బసు వారితో ప్రజా సమస్యల గురించి చర్చలు మొదలుపెట్టేవారన్నారు. తప్పనిసరిగా కొన్ని సమావేశాలకు ఆయన హాజరుకావలసి వచ్చేది. కానీ ఆయన హృదయం మాత్రం మూసిన గది తలుపుల మాటున ఉండలేకపోయేదని చెప్పారాయన.

వ్యక్తిగా, రాజకీయ వేత్తగా జ్యోతిబసు ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని కలిగివుండేవారని, ఎటువంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోయే వారుకాదని ఇలాంటి నేతలు ఇక భవిష్యత్తరాల వారికి కనపడరని గోకుల్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి