2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి పీఠానికి పోటీ పడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఆ పోటీని ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మూడో స్థానానికి పడిపోయాడు.
ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పీఠానికి పోటీ చేయాలని 25 శాతం మంది కోరుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 44 శాతం మెట్రో నగర వాసులు ఏఏపీకి ఓట్లు వేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇప్సోసోలు సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేను ఈనెల మూడు నుంచి ఏడో తేదీ మధ్య నిర్వహించారు. 18-45 యేళ్ల మధ్య స్త్రీ పురుషులను సర్వే చేశారు.
ఇందులో ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో బీజేపీ నేత నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ మూడో స్థానానికి దిగజారాడు.
ఈ సర్వే ప్రకారం... ఉత్తమ ప్రధాన మంత్రిగా మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు 58 శాతం మంది ఓటేయగా.. 25 శాతం ఓట్లతో రెండో స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 14 శాతంతో మూడో స్థానానికి పడిపోయారు.