ఫోజులిచ్చేముందు కాస్త ఆలోచించండి: రాష్ట్రపతి

FILE
మసక వెలుతురుల్లో ప్రకటనలకు ఫోజులిచ్చేటపుడు సదరు మహిళలు కాస్త ఆలోచించి ఫోజులివ్వాలని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పిలుపునిచ్చారు. కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలకు ఫోజులిచ్చేటపుడు మహిళలకు తమకు తాము ఆలోచించుకుని ముందుకు సాగాలన్నారు. అలా ఆలోచించి అటువంటి ప్రకటనలకు ఫోజులివ్వడం మానేస్తే... భవిష్యత్తులో అభ్యంతరకరమైన ఫోజులనే మాట వినబడదని పాటిల్ పేర్కొన్నారు.

మహిళలు అభ్యంతరకరమైన ఫోజులివ్వకుండా ప్రభుత్వం నిరోధించవచ్చు కదా... అని ఓ బాలిక అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వం కొంతమేరకే ఏదైనా చేయగలదని జవాబిచ్చారు. కానీ ప్రతి మనిషి తను జీవితంలో ఎలా ఉండాలనే అంశాన్ని ఆలోచించాలని సూచించారు.

రకరకాల భంగిమల్లో ఫోటోలు కావాలంటూ ప్రకటనదారులు వచ్చినా మహిళలు తమకుతాము అటువంటి భంగిమల్లో ఫోజులివ్వడం కుదరదని చెప్పినపుడు పరిస్థితి చక్కబడుతుందని పాటిల్ పేర్కొన్నారు.

ఐదు రోజుల పర్యటన నిమిత్తం అహ్మదాబాదుకు వెళ్లిన పాటిల్ అక్కడ గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న బాలికలతో సంభాషించారు. ఆంధ్రప్రదేశ్ మహిళ కమలమ్మ తనకు ఇచ్చిన చరఖాను గాంధీజీ ఆశ్రమానికి ఇచ్చారు. దానిని గాంధీజీ మ్యూజియంలో ఉంచాల్సిందిగా సూచించారు.

వెబ్దునియా పై చదవండి