భారత్‌లో నేడు ఎఫ్‌బీఐ ఛీఫ్ పర్యటన

మంగళవారం, 3 మార్చి 2009 (10:38 IST)
అమెరికాకు చెందిన నేర పరిశోధన విభాగం ఎఫ్‌బీఐ ఛీఫ్ రాబర్ట్ ముల్లెర్ మంగళవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం, ఇతర ప్రధాన అధికారులతో కీలక చర్చల్లో పాల్గొననున్నారు.

భారత్ చేరిన తర్వాత ముందుగా ముల్లెర్ 26/11 ముంబాయి ఉగ్రవాద దాడులకు చెందిన సమాచారాన్ని, పరిశోధన వివరాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత చిదంబరం నేతృత్వంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారయణన్ మరియు ఇంటలిజెన్స్ బ్యూరో ఛీఫ్ రాజీవ్ మథుర్‌లతో జరిగే సమావేశంలో ముల్లెర్ పాల్గొంటారు.

ఈ సమావేశంలో ఉగ్రవాద నియంత్రణతో సహా భద్రతాపరమైన అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ముల్లెర్ ఈ పర్యటనలో భారత సీబీఐ ఛీఫ్ అశ్వనీ కుమార్‌ను కలవకపోవడం గమనార్హం.

కాగా, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌తో సహా సాంకేతిక పరమైన సాక్ష్యాలకు సంబంధించిన క్లిష్టమైన విశ్లేషణల్లో మరియు లష్కరే తోయిబా ఉగ్రవాదులచే ఉపయోగించబడిన ఉపగ్రహ ఫోన్‌ల కీలక సమాచారాన్ని రాబట్టడంలో ఎఫ్‌బీఐ తన వంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ పరిశోధనలో భాగంగానే ముంబాయి దాడులకు చెందిన సాక్ష్యాలను పరిశీలించేందుకు.. అలాగే ఈ దాడులకు సంబంధించి కస్టడీలోకి తీసుకున్న అనుమానితులను ప్రశ్నించేందుకు కూడా ఎఫ్‌బీఐకు భారత్ అనుమతినిచ్చింది.

వెబ్దునియా పై చదవండి