మహాత్మా గాంధీ: పాట్నాలో 70 అడుగుల ఎత్తుతో కాంస్య విగ్రహం ఆవిష్కరణ!

FILE
ప్రపంచంలోనే పెద్దదైన జాతిపిత మహాత్మాగాందీ విగ్రహాన్ని బీహార్‌లో ఆవిష్కరించారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీష్ కుమార్ జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుమారు 70 అడుగుల ఎత్తున్న జాతిపిత విగ్రహాన్ని పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో నెలకొల్పారు. ఇది కాంస్య విగ్రహం కావడం గమనార్హం.

దీనిని పది కోట్ల రూపాయల వ్యయంతో బీహార్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చెందిన శిల్పి రామ్‌ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహాత్ముడు నిలబడి ఉన్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు ఎంతో గర్వకారణమని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకు ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్ముడి విగ్రహమే పెద్దదిగా భావిస్తున్నారు. పార్లమెంటులో గాంధీ విగ్రహం ధ్యానముద్రలో ఉంటారు. పాట్నాలో నెలకొల్పిన విగ్రహంలో గాంధీజీ చిరునవ్వుతో కనిపిస్తారు.

పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎత్తు 16 అడుగులు కావడం గమనార్హం. అయితే పాట్నాలోని గాంధీ విగ్రహం ఎత్తు 40 అడుగులు. ఇందుకోసం ఉపయోగించిన పీఠం ఎత్తు ముప్పై అడుగులు. మొత్తం డెబ్బై అడుగుల ఎత్తు విగ్రహం అని బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి