యాభై శాతం టిక్కెట్ల కోసం ఎన్.సి.పి పట్టు

FileFILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు యాభై శాతం టిక్కెట్లను కేటాయించాలని నేషనలిస్టు కాంగ్రెస్ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమతో కాంగ్రెస్‌కు పొత్తు పెట్టుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నందున తాము ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్, ఎన్.సి.పిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పంచాలని ఆయన కోరారు.

కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య సీట్ల పంపిణీపై ముంబైలో సోమవారం చర్చలు జరుగనున్నాయి. దీనికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రానున్న ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగాలని అనుకోవడంలేదని పవార్‌ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ పెద్ద పార్టీ జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీ అయినందున సీట్ల పంపిణీ, నిర్ణయంలో ఆ పార్టీదే పైచేయిగా ఉంటుందన్నారు.

అయితే కూటమిలోని పార్టీలు ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంటే ఆ స్థానాలను వారికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి యూపీఏతోనే కలిసివెళ్లాలనుకుంటున్నట్టు పవార్‌ తన మనోగతాన్ని వెళ్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా హెచ్చుమీరుతున్న ఉగ్రవాదానికి అగ్రదేశం అమెరికాయే బాధ్యత వహించాలని సూచించారు. ఆ దేశం వివిధ దేశాల పట్ల అనుసరిస్తున్న వివక్ష కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.

వెబ్దునియా పై చదవండి