యునైటెడ్ నేషనల్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (యూఎన్పిఏ) కూటమి బీటలు వారింది. ఐఎన్డీఎల్ అధినేత ఓం ప్రకాష్ చౌతలా నేతృత్వంలోని యూఎన్పీఏ కూటమి రెండు ముక్కలు కానుంది. అణు ఒప్పందాన్ని సమర్థించాలని ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీని పర్యావసానంగా యూఎన్పీఏ కూటమి నుంచి ఎస్పీని బహిష్కరించాలని యూఎన్పీఏ కూటమి నేతలు భావిస్తున్నారు.
ఈ మేరకు ఓం ప్రకాష్ చౌతలా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వారిని (ఎస్పీ) అవమానించింది. ఇలా జరగడం మూడో పర్యాయం. మళ్లీ అవమానిస్తోంది. అయినా ఇది వారి వ్యక్తిగత ఆలోచన అని చౌతలా అన్నారు. అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న ప్రధాన పార్టీల్లో ఐఎన్డీఎల్ ఒకటని హర్యానా మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అణు ఒప్పందం అమల్లోకి వస్తే భారత్ మళ్లీ అమెరికాకు బానిసగా మారుతామనే వాస్తవం తమను వేధిస్తోందని ఆయన అన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అవమానాలు ఎదురవుతున్నప్పటికీ వారు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతుతో ఉత్తరప్రదేశ్లో అధికారం చెలాయించారని అన్నారు. అణు ఒప్పందంపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఈనెల మూడో తేదీన సమావేశమైన యూఎన్పీఏ నేతలు నిర్ణయించారు.
ఇంతలో ఎస్పీ నేతలు ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత తమ మనస్సు మార్చుకుని జాతి ప్రయోజనాల దృష్ట్యా అణు ఒప్పందానికి మద్దతు ఇస్తున్నట్టు వారు ప్రకటించారు.