లోక్‌పాల్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతా: హెగ్డే

లోక్‌పాల్ ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీలో తాను సభ్యుడిగా కొనసాగనున్నట్టు కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తెలిపారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఐపీఎస్‌ మాజీ అధికారి కిరణ్‌ బేడీ మీడియాకు తెలిపారు.

కమిటీ సభ్యులపై వచ్చిన ఆరోపణలపై విచారణకు అత్యున్నత స్థాయి స్వతంత్ర సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమ కమిటీ లేఖ రాయనున్నట్లు కూడా ఆమె తెలిపారు. దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన విమర్శలపై తాను బాగా కలత చెందినట్లు తెలిపారు.

దిగ్విజయ్‌ సింగ్‌ ఆ తరువాత హెగ్డేను దేశంలోకెల్లా అత్యుత్తమ లోకాయుక్తగా అభివర్ణించిన విషయం తెల్సిందే. రెండు రోజుల క్రితం తానెవరో తెలీదని చెప్పిన వ్యక్తి, ఆ తరువాత తనకు కితాబు నివ్వడం వెనుక కుట్ర దాగి ఉందని హెగ్డే అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులను అప్రదిష్ట పాల్జేయాలన్నదే ఆ కుట్ర అని హెగ్డే ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి