సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం: బూటాసింగ్

శనివారం, 1 ఆగస్టు 2009 (17:33 IST)
కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) చేపట్టే విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, కేంద్ర మాజీ మంత్రి బూటా సింగ్ స్పష్టం చేశారు. తన కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్ చేసిన నిర్వాకం వల్ల బూటాసింగ్ చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.

ఒక కాంట్రాక్టరుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును ఎత్తివేయించేందుకు బూటాసింగ్ కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్ రూ.కోటి డిమాండ్ చేయడంతో సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. కాగా, ఈ కేసును జాతీయ కమిషన్ విచారణ జరుపుతోంది. అందువల్ల బూటాసింగ్ ప్రమేయం కూడా ఉండివుండవచ్చన్న అనుమానంతో సీబీఐ బూటాసింగ్ వద్ద విచారణ జరపాలని నిర్ణయించుకుంది.

దీనిపై ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సరైన మార్గంలో సీబీఐ విచారణ చేపడితే, దాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. తనపై జరిగిన రాజకీయ కుట్రపై పోలీసులకు సమాచారం అందించానని తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. తన పిల్లలను కొంతమంది సంప్రదిస్తున్న సమాచారాన్ని ముందుగానే పోలీసు కమిషనర్‌కు చేరవేశానని, వారిపై చర్య తీసుకోని పోలీసులు తమపైనే కేసు నమోదు చేసి, అప్రతిష్టపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి