హిందువులు కూడా ఆవు మాంసాన్ని తింటున్నారు... లాలూ వివాదాస్పద వ్యాఖ్య

శనివారం, 3 అక్టోబరు 2015 (15:19 IST)
ఒకవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆవును వధించారన్న ఆరోపణ నేపధ్యంలో 50 ఏళ్ల ముస్లిం వ్యక్తిని చంపేసిన ఘటన రగులుతూ ఉండగానే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. శనివారం నాడు ఆయన మాట్లాడుతూ... విదేశాల్లో నివాసముంటున్న హిందువులు, భారతీయులు ఆవు మాంసాన్ని తింటున్నారంటూ వ్యాఖ్య చేశారు. లాలూ వ్యాఖ్యలపై భాజపా నాయకుడు గిరిరాజ్ సింగ్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. తక్షణమే లాలూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ఐతే గిరిరాజ్ డిమాండ్ కు ఎంతమాత్రం వెనక్కి తగ్గని లాలూ మరికాస్త ముందుకువెళ్లి... భాజపా గోవధను నిషేధించడం ద్వారా దేశాన్ని మతవాద దేశంగా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు చాలామంది రోజువారీగా ఆవు మాంసాన్ని తింటున్నారు. ఐతే ఆ మాంసం ఆవుదా లేదా మేక లేదా గొర్రెదా అనేది కాదు ముఖ్యం.. వారు ఖచ్చితంగా మాంసాన్ని తింటున్నారంటూ చెప్పుకొచ్చారు.
 
తన అభిప్రాయం ప్రకారం సంస్కృతి, సంప్రదాయలు తెలిసిన వ్యక్తి అసలు మాంసాన్ని భుజించరాదనీ, జీవ హింస చేయరాదని వెల్లడించారు. ఈ మాంసం తినడం వల్ల మనిషికి ఎన్నో అనారోగ్యాలు దరిచేరుతాయని అన్నారు. మరోవైపు లాలూ హిందువుల పట్ల చేసిన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కి తీసుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి