చత్తీస్గఢ్లో కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ రెసిడెన్సియల్ స్కూల్లో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ బాలికపై సమీప బంధవు ఒకరు పలుమార్లుగా హాస్టల్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. విషయాన్ని బయట పెట్టకుండా హాస్టల్ వార్డెన్ కూడా దాచి పెట్టారు. తరువాత హాస్టల్లోనే బలవంతంగా ప్రసవం చేయించారు. ఆపై పుట్టిన పసి కందును సమీపంలోని నదిలో పారేశారు. అయితే ఈ సంఘటన బయటకు పొక్కి మీడియాలో ప్రచురితమైంది. అప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
కొరియా జిల్లా కలెక్టర్ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నిందితుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు. కానీ సూపరింటెండెంట్, ఆమె భర్త పరారీలో ఉన్నారు. సూపరింటెండెంట్ బలవంతంగా బాలికకు హాస్టల్ క్యాంపస్లో ప్రసవం చేయించినట్టు పోలీసులు తెలిపారు. నది సమీపంలో పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనపై అత్యాచారం చేశాడని, హాస్టల్లోనే ప్రసవించినట్టు బాధితురాలు విచారణలోతెలిపింది. ఇంత జరిగినా ఆమె కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.