14న 'కరుణ' నేతృత్వంలో అఖిలపక్షం భేటీ

శ్రీలంక తమిళుల సమస్యపై తమిళనాడు ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పలు రకాల ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ కూడా తన వంతు చర్యలు చేపట్టింది. సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి స్వయంగా లేఖ కూడా రాశారు.

ఈనేపథ్యంలో వచ్చే 14వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశం సచివాలయంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు జరుగనుంది. ఈ మేరకు అన్ని పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయంగా ఆహ్వాన పత్రికలను పంపినట్టు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

శ్రీలంకలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశ సైన్యం ఎల్టీటీఈ స్థావరాలపై ముమ్మరంగా దాడులు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ దాడులు పలు జనావాస ప్రాంతాలపై సైతం జరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది అమాయక తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనిపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వామపక్షాలు ఒక రోజు నిరాహారదీక్షను చేపట్టగా, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ధర్నాలు, మౌన ప్రదర్శనలు నిర్వహిస్తోంది.

వెబ్దునియా పై చదవండి