పొట్ట నిండా నాణేలే.. 173 వాటి వెలికి తీసిన డాక్టర్లు.. ఎలా బతికాడో ఏమో..

గురువారం, 28 మే 2015 (06:45 IST)
ఎంత దొంగలించే బుద్ధి ఉన్నా నాణెం కనిపిస్తే.. అలా తీసి ఇలా జేబులోనో లేదా మరెక్కడో దాచేస్తారు. కానీ ఇతగాడికి జాగ్రత్త ఎక్కువ నాణెం కనిపిస్తే చాలు నేరుగా మింగేస్తాడు. తన పొట్టలో భద్రంగా దాచుకుంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు మింగేశాడు. వీటిని బయటకు తీసిన డాక్టర్లు ఇంతకాలం ఎలా బతికాడాని ఆశ్చర్యపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కర్ణాటక రాష్ర్టం బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)లో  ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అతని కడుపు నుంచి 173 నాణేలు వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు  చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో స్థిరపడ్డాడు. అతనికి మతిస్థిమితం లేదు. అప్పుడప్పుడు తనకు తెలీకుండానే నాణేలు మింగాడు.
 
దీంతో కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తాయి. దీంతో అతని బంధువులు 15 రోజుల క్రితం బళ్లారి విమ్స్‌లో చేర్పించారు. ఆ వ్యక్తి కడుపులో నాణేలు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి, 173 రూపాయి, ఐదు, పది రూపాయల నాణేలను బయటకు తీశారు. రోగికి ఎలాంటి ప్రాణాప్రాయమూ లేదని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి