సెక్షన్ 144 గురించి అందరికి తెలుసు. ఏవైనా హింసాత్మక ఘటనలు జరిగినపుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు ఈ సెక్షన్ ను విధిస్తారు. ఎలక్షన్ టైంలోనూ దీన్ని వాడతారు. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సంబంధం లేకుండా స్వైన్ ఫ్లూ రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్లో అధికారులు సెక్షన్ 144 ను విధించారు.
ప్రజలు రోడ్లపై గుంపులుగా కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కువ మంది కలిసి వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లోనే స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా, అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.