ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ భార్య ఆత్మహత్య కేసులో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చారు. తన భర్త నపుంసకుడని, ఆయన పైశాచిక ప్రవర్తన తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎయిమ్స్లో అసస్థీషియా స్పెషలిస్ట్గా పనిచేస్తున్న ప్రియకు, డెర్మటాలజిస్ట్గా పనిచేస్తున్న కమల్కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దక్షిణ ఢిల్లీలోని ఎయిమ్స్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు.
పెళ్లయిన తరువాత కమల్ నపుంసకుడని తెలిసినా సర్దుకుపోయానని, కానీ, పరిస్థితిని తాను చనిపోయేవరకూ తీసుకువచ్చాడని సుదీర్ఘ లేఖ రాసింది. తాను 'గే' నన్న విషయాన్ని కమల్ దాచిపెట్టాడని, కట్నం కోసం వేధించాడని ఆమె లేఖలో ఆరోపించింది.
ఆమె చనిపోయే ముందు ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ "నేను నీతోనే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఎంతో ప్రేమించాను కాబట్టి. నీ లోపాన్ని కూడా భరించాను. కానీ, నువ్వు నా జీవితానికి ఓ క్రిమినల్గా మారావు. నీ కుటుంబానికి ఈ విషయాలు తెలీవు. నువ్వో దయ్యానివి" అని పేర్కొంది.
కాగా అదే రోజు కమల్ తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం వెతికిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి డాక్టర్ను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.