మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల పంపిణీపై భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఇందుకోసం సీట్ల పంపిణీ అంశంలో మాట్లాడుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, సీట్ల విషయమై శివసేన చేస్తున్న ప్రతిపాదనలను పునరాలోచించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కోరారు.
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 135 చోట్ల పోటీ చేస్తామని బీజేపీ అంటుండగా, శివసేన మాత్రం 119కి మించి ఇచ్చేది లేదని చెపుతోంది. ఈనెల 27తో నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోతుంది. త్వరలోనే అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పొత్తు విషయమై తమ నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ తెలిపారు.