విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన నల్లధన కుబేరుల సంఖ్య 427గా ఉందని, ఈ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పటి వరకు దేశంలో 427 మందికి విదేశాల్లో ఖాతాలున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.
నల్లధనంపై రాజ్య సభలో ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఖాతాలున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నోటీసులు పంపిందని అన్నారు. 427 మందిలో 250 మంది తమకు విదేశాల్లోని హెచ్ఎస్బీసీలో ఖాతాలున్నాయని అంగీకరించారని ఆయన సభకు వివరించారు. చట్టానికి లోబడి ఉన్న ఖాతాల జోలికి వెళ్లమని ఆయన స్పష్టం చేశారు.
నల్లధనంపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన వివరించారు. కొన్ని వారాల్లో మరిన్ని కేసులు నమోదు చేస్తామని ఆయన సభకు తెలిపారు. విచారణ ప్రారంభమయ్యాక వారి పేర్లు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. దీంతో, నల్ల ధనంపై ప్రభుత్వ స్పందనకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.