మలయాళ నటి భావన కిడ్నాప్ కేసు మరవని నేపథ్యంలో గాయనిపై ఓలా కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. విధులు ముగించుకుని తెల్లవారుజామున క్యాబ్లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ గాయనిపై అదను చూసుకుని డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే కామాంధుడి బారి నుంచి గాయని తప్పించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. గాయని కోరమంగళ నుంచి బేగూరుకు ఓలా క్యాబ్లో ఇంటికి బయల్దేరింది. క్యాబ్ డ్రైవర్ రవికుమార్ ఓ ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాక బొమ్మనహళ్లి సిగ్నల్ దాటిన తరువాత గబుక్కున మరో రోడ్డులోకి పోనిచ్చాడు. అది గమనించిన గాయని రూట్ ఎందుకు మార్చావంటూ ప్రశ్నించింది. ఆ మార్గంలో రోడ్డు సరిగా లేదని చెప్పిన డ్రైవర్ రవికుమార్ కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపాడు.
డోర్ తీసుకుని దిగాక బ్యాక్ డోర్ తీసి గాయని పక్కన కూర్చున్నాడు. ఆమెపై చేయి వేశాడు. గాయని జాగ్రత్తపడి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పారిపోయాడు. ఆ సమయంలో సహాయపడేందుకు ఎవ్వరూ లేకపోవడంతో గాయని నడుచుకుంటూ సమీపంలోని లక్ష్మి స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసింది. స్నేహితుల సాయంతో ఈ ఘటనపై బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.