భారత ఆర్మీలో వధువు తండ్రి పనిచేస్తున్నాడు. వధువు కూడా ఆర్మీలో సైనికుడినే పెళ్లాడనుంది. ఇంతలోనే పెళ్లి కూతురిపై యాసిడ్ దాడి జరిగింది. ఇందుకు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లికి నాలుగు గంటలే ఉండగా పెళ్లికూతురిని ఓ మహిళ కలిసింది. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడారు. ఇంతలోనే పెళ్లి కూతురిని కలిసేందుకు వచ్చిన మహిళ వధువుపై యాసిడ్ దాడికి పాల్పడింది.
అనంతరం వధువు ఉన్న గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయింది. వధువుకి ఈ ఘటనలో తీవ్రగాయాలైనాయి. ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందించి, తిరిగి మండపానికి తీసుకొచ్చారు. ఇదంతా జరిగేసరికి పెళ్ళి జరుగుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ పెళ్ళికొడుకు యాసిడ్ దాడి జరిగినా పర్లేదు.. ఆమెనే మనువాడాలనుకున్నాడు. అంతే నిర్ణయించిన ముహూర్తంలోనే ఆమె మెడలో మూడు ముడులు వేశాడు.