భారతదేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. గొప్ప పేరుప్రతిష్ఠలున్న ఆ విభాగాన్ని కొందరు అధికారులు గబ్బుపట్టిస్తున్నారు. ఎండనకా వాననకా కాపలా కాస్తోన్న జవాన్లకు అందాల్సిన బలవర్ధక ఆహారపదార్థాలను నల్ల బజారులో అమ్ముకుంటున్నారు. ఇందులో భాగంగా ఆహార నాణ్యత విషయంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాను పోస్ట్ చేసిన వీడియో ఘటన మరిచిపోకముందే బీఎస్ఎఫ్పై మరికొన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తమకు వచ్చే సరకులు, పెట్రోల్, డీజిల్ వంటివి స్థానికులకు సగం ధరకే బీఎస్ఎఫ్ అధికారులు కొందరు విక్రయిస్తుంటారంటూ ఆరోపణలు వినపడుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కేంద్రంలో కొందరు అధికారులు ఇక్కడి వర్తకులకు వీటిని విక్రయిస్తున్నారని స్థానికులు, బీఎస్ఎఫ్కు చెందిన జవానులు ఆరోపిస్తున్నారు. తమకు కూడా ఇవ్వకుండా కందిపప్పు, కూరలు వంటివి బయట ఉండే వర్తకులకు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ వంటివి బీఎస్ఎఫ్ అధికారులు తక్కువ ధరకే విక్రయిస్తుంటారని, బియ్యం, పప్పులు వంటివైతే చాలా చౌకగా దొరుకుతుంటాయని ఓ సివిల్ కాంట్రాక్టర్ వ్యాఖ్యానించారు. బీఎస్ఎఫ్లో ఈ-టెండర్ విధానం లేకపోవడం వల్ల తమ వద్ద ఫర్నిచర్ కొనుగోలు చేసి కమిషన్లు కూడా తీసుకుంటారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫర్నిచర్ డీలరు ఆరోపించారు. ఒక్కోసారి నాణ్యతను కూడా పట్టించుకోరని వ్యాఖ్యానించారు.