ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య అత్యంత ఖరీదైన వాచ్ను ధరించి వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత తాను ప్రయాణించే కారుపై కాకి వాలిందని కొత్త కారు కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ వివాదాలు ఆయనకు ఎంతటి తల నొప్పులు తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బెంగళూరులో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్కు సిద్ధరామయ్య హాజరయ్యారు. కురుబా సామాజిక వర్గం ప్రతినిధులను సన్మానించే కార్యక్రమమిది. సిద్ధరామయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. సన్మాన కార్యక్రమంలో భాగంగా చిక్మగ్లూరు జిల్లా తారికెర్ తాలూకా పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్ను సిద్ధరామయ్య సన్మానించారు.
తనకు జరిగిన సన్మానం పూర్తికాగానే ఆమె సిద్ధరామయ్య కుడి బుగ్గపై ముద్దుపెట్టారు. ఆయన తేరుకుని స్పందించేలోగానే ఆమె వేదిక మీద నుంచి కిందకు దిగిపోయారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఆయన (సిద్ధరామయ్య) తన తండ్రిలాంటి వారనీ, తొలిసారిగా ఆయనను కలుసుకున్నానని చెప్పింది. ఆ సంతోషాన్ని ఆపుకోలేకే ముద్దుపెట్టుకున్నానని, ఇందులో తప్పేమీ లేదంటూ వివరణ ఇచ్చారు.