నిజానికి బొగ్గు కుంభకోణం కేసును మూసేసి... చేతులు దులుపుకుందామని సీబీఐ భావించింది. అయితే, ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఝులక్తో సీబీఐ దోషిలా నిలబడాల్సి వచ్చింది. వివాదాస్పదమైన బొగ్గు క్షేత్రాల కేటాయింపు సమయంలో బొగ్గు శాఖ కూడా మన్మోహన్ సింగ్ వద్దే ఉంది. ఈ కేసు మూసివేతకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన నివేదికపై మంగళవారం నిర్ణయం వెలువరించాల్సిన న్యాయమూర్తి భరత్ పరాశర్ సీబీఐకి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
‘ఈ విషయంలో అప్పటి బొగ్గు గనుల శాఖ మంత్రి (మన్మోహన్)ని ప్రశ్నించాలని మీకు అనిపించలేదా? ఆయన వాంగ్మూలం తీసుకోవాలనుకోలేదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే.. నాటి ప్రధాని మన్మోహన్ను ప్రశ్నించేందుకు తమకు అనుమతి లభించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. అదేసమయంలో పీఎంఓ అధికారులను ఆరా తీసినట్టు చెప్పారు.