ఆస్పత్రిలో నర్సు.. బయట బిడ్డ.. యడ్డీని కదిలించిన వీడియో

గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:40 IST)
కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దేశంలోనూ కరోనా కారణంగా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనాపై పోరాటం చేసేందుకు కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ విధించిన తరుణంలో.. ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు. కానీ కరోనా మాత్రం ప్రజలను వదిలిపెట్టట్లేదు. అయితే వైద్యవృత్తిలో ఉన్న ఎందరో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతూ.. వీరికి వైద్యం అందిస్తున్నారు.
 
తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా, తమ కుటుంబసభ్యులను కలవకుండా వాళ్లు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. అలా కరోనా వైరస్ కారణంగా దూరమైన ఓ తల్లీకూతుళ్లకు సంబంధించి ఓ చిన్న వీడియో కర్ణాటక సీఎం యడ్యూరప్పను కదిలించింది. ఎంతలా అంటే ఆయన స్వయంగా ఆ నర్సుకి ఫోన్ ధైర్యం కూడా చెప్పేంతగా ఆ వీడియో ప్రభావం చూపింది.
 
బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేస్తున్న సుగంధ అనే నర్సులు గత 15 రోజులుగా తన కుటుంబానికి దూరంగా ఉంటూ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందిస్తుంది. అయితే తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారి కూతురిని తీసుకొని ఆమె భర్త ఆస్పత్రి వద్దకు వచ్చాడు. కానీ, దగ్గరకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో తన కూతురికి ఆమె చాలా దూరంలో నిలుచుంది. 
 
తల్లి కోసం ఏడుస్తున్న కూతురిని చూసి సుగంధతో పాటు అక్కడ ఉన్నవారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కూతురికి బై చెప్పి సుగంధ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోని టీవీలో చూసిన సీఎం యడ్యూరప్ప ఆ నర్సుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు