మరో నెల పాటు వర్క్ ఫ్రమ్ హోం సేవలు?? మేలో రెండో దశ లాక్‌డౌన్??

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (15:29 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. అయితే, 15వ తేదీ తర్వాత ఈ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా లేదా అన్నదానిపైనే ఇపుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. 
 
ఈ లాక్‌డౌన్ ఎత్తివేత, ఒకవేళ ఎత్తివేసిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులపై 16 మందితో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈ నెల 3వ తేదీన సమావేశమై కూలంకుషంగా చర్చించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యం వహించగా, హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. 
 
అయితే, ఈ సమావేశంలో చర్చించిన విషయాలు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఏప్రిల్ 14 న లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత... మే 15 నుంచి రెండో దశ లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని ఆలోచన కేంద్ర మంత్రులకు వచ్చిందట. 
 
అయితే మొదటి దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా మంత్రులు మాట్లాడుకున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసినా సరే... నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని, అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలని వారు భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు.
 
ఇకపోతే 'వర్క్ ఫ్రం హోం' చేసే ఉద్యోగులకు మరో నెల పాటు ఇదే వసతి కొనసాగిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా రద్దీ లేకుండా ఆయా యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలని మంత్రుల బృందం భావించినట్లు సమాచారం. 
 
అలాగే విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది. కానీ, ఈ మంత్రుల సంఘం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, అత్యంత కీలకమైన 16 మంది కేంద్ర మంత్రులు పాల్గొన్న సమావేశంలో మాత్రం ఈ ప్రతిపాదనలన్నీ కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు