తరాలు మారినా, ప్రేమపై తండ్రుల అభిప్రాయాలు, అపోహలు మాత్రం మారలేదు. తాజాగా ఓ తండ్రి తన కుమారుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడనే కోపంతో, కోడలి మెడలో ధరించి ఉన్న తాళిబొట్టు తెంచి, కాల్చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని కలకలం రేపుతోంది.
ఈ దారుణ సంఘటన సేలం జిల్లా ఓమలూరు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పన్నపట్టికి చెందిన వ్యక్తి పళణిస్వామి కుమారుడు గోవింద (22) సేలంలో వున్న ఒక జౌళి దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో పని చేస్తున్న దివ్య (19)ని గోవింద రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ స్థితిలో గత నెల 23వ తేదీ సేలం ఊత్తుమలై మురుగన్ ఆలయంలో గోవింద, దివ్య వివాహం చేసుకున్నారు.
తరువాత ప్రేమికులు ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న గోవింద తండ్రి పళణిస్వామి తన కుమారుడిని ఇంటిలోనే బంధించి పనికి మాన్పించాడు. దీంతో స్నేహితుల సహాయంతో బయటపడిన గోవింద వివాహం చట్టబద్ధం కావడానికి ఓమలూరులో రిజిష్టర్ వివాహం చేసుకోవడానికి దివ్యను తీసుకుని రిజిష్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న పళణిస్వామి ప్రేమికులను వెంటాడి వారిపై దాడి చేసి దివ్య మెడలో వున్న తాళి బొట్టు తెంచి దగ్ధం చేశాడు.