నాథూరాం గాడ్సేకు విగ్రహం : కాంగ్రెస్ ఆగ్రహం.. మోడీ స్పందిచాలి!

శనివారం, 20 డిశెంబరు 2014 (17:34 IST)
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన హంతకుడు నాథూరాం గాడ్సేకు విగ్రహ ప్రతిమలను నెలకొల్పుతామంటూ అఖిల భారత హిందూ మహాసభ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఇదే అంశంపై కాంగ్రెస్ నేత కె.రహమాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం, ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంలో వారి వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని జాతి కోరుకుంటోంది. వారు గాడ్సే జీవితాన్ని పొగిడి, జయంతిని జరుపుకున్నారు. ఇప్పుడు విగ్రహం పెట్టాలని మాట్లాడుతున్నారు. కానీ ప్రధానమంత్రి ఏమీ చెప్పడం లేదు అని అన్నారు. 
 
మరోవై నేత మధుసూదన్ మిస్త్రీ మాట్లాడుతూ హిందూ మహాసభ ప్రకటన బీజేపీ వాస్తవ రూపాన్ని తెలుపుతోందని, భవిష్యత్తులో పార్లమెంటులోని ప్రముఖుల విగ్రహాల పక్కన గాడ్సే విగ్రహం పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
కాగా, గాడ్సే విగ్రహాన్ని దేశ రాజధాని ఢిల్లీలో పెట్టాలని అఖిల భారతీయ హిందూ మహాసభ డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఢిల్లీలో స్థలం కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా, ఇప్పటికే రూ.75 వేల వ్యయంతో గాడ్సేకు పాలరాతి ప్రతిమను కూడా తయారు చేసి సిద్ధంగా ఉంచిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి