శశికళకు ప్రజలు ఓట్లేయలేదు... అమ్మ వారసురాలిని ముమ్మాటికీ నేనే : దీప

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:30 IST)
అన్నాడీఎంకే శశికళ ముఖం చూసి ప్రజలు ఓట్లేయలేదని దివంగత జయలలిత మేనకోడలు దీప జయకుమార్ అన్నారు. పైగా, జయలలిత నిజమైన వారసురాలిని తానేని చెప్పుకొచ్చారు. చెన్నై, టీ.నగర్‌లోని ఇంటి దగ్గర దీపా పేరవై సంస్థ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మంగళవారం మాట్లాడుతూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరపున తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని తెలిపారు. అమ్మ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తానని, త్వరలోనే కొత్త పార్టీ పెడతానని తెలిపారు. 
 
పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదన్నారు. అదే సమయంలో జయలలిత మృతిపైనా ఆమె అనుమానాలున్నాయన్నారు. జయలలితకు అందించిన చికిత్స రికార్డులన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అమ్మ మృతిపై అపోలో వైద్యులు ఇచ్చిన వివరణ సరిపోదని, ఇంకా చాలా అనుమానాలకు సమాధానం రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 
 
శశికళను సామాన్యంగా వదిలిపెట్టనని, రాజకీయంగానే ఎదుర్కొంటానని దీపా జయకుమార్ ఛాలెంజ్ చేశారు. తనను నమ్ముకుని ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు చెప్పినట్లు తాను నడుచుకుంటానని, మీరు చెప్పినట్లు జయలలిత పేరు నిలబెట్టడానికి ఎంతవరకైనా పోరాటం చెయ్యడానికి తాను సిద్ధంగా ఉన్నానని దీపా పేరవై సంస్థ నాయకులు, కార్యకర్తలకు దీపా జయకుమార్ హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి