ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ తన కుమార్తెను చూశాకే ఉరి కంబమెక్కాడు. యాకుబ్ మెమన్ చివరి కోరికను నాగ్ పూర్ జైలు అధికారులు తీర్చారు. చివరి కోరిక మేరకు అతడికి కూతురిని చూపించిన జైలు అధికారులు, ఆ తర్వాత ఉరి కంబమెక్కించారు. శిక్ష అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలైన యాకుబ్ పిటిషన్ను అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇకపోతే ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు గురువారం ఉదయం 6.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. మహారాష్ట్ర నగరం నాగ్ పూర్లోని సెంట్రల్ జైల్లో అధికారులు అతడిని ఉరి తీశారు. ఐదుగురు అధికారుల సమక్షంలో యాకుబ్కు ఉరిశిక్ష అమలైంది. యాకుబ్కు ఉరిశిక్షను ఖరారు చేసిన టాడా కోర్టు న్యాయమూర్తి, నాగ్ పూర్ జైలు సూపరింటెండెంట్, మహారాష్ట్ర సీఎం కార్యాలయ అధికారి, డీఐజీ స్థాయి పోలీసు అధికారి, యాకుబ్ వైద్య చికిత్స చేసిన వైద్యుల సమక్షంలో ఉరి శిక్ష అమలైంది.