నిద్ర లేచి చూసేసరికి షీనా చచ్చిపోయి ఉంది... ఇంద్రాణి రెండో భర్త, స్పాట్ చూసింది ఇతడే... పోలీస్

శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:53 IST)
ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు ఆమె హత్య గురించి తలోరకంగా చెపుతున్నారు. హత్యలో కీలక నిందితుడిగా ఉన్న ఇంద్రాణి రెండో భర్త సంజీవి ఖన్నా కోల్ కతా కోర్టు ముందు తను పూర్తిగా అమాయకుడినని వాదించాడు. ఆరోజు, తనను ఇంద్రాణి పిలిచింది వాస్తవమేనని, ఐతే తన కుమార్తె విధిని చూసేందుకు రమ్మని చెప్పిందని వెల్లడించాడు. అందుకే అక్కడికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తను ముంబైకి వెళ్లగానే కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ నన్ను పికప్ చేసుకున్నాడనీ, ఆ కారులో షీనాతో పాటు ఇంద్రాణి కూడా ఉన్నట్లు వెల్లడించాడు. 
 
కారు ఎక్కాక తను నిద్రపోయాననీ, అలా కొద్దిసేపు కునుకు తీసి నిద్ర లేచేసరికి షీనా శవమై ఉన్నదని చెప్పుకొచ్చాడు. తనకు షీనా హత్యకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. ఐతే పోలీసులు వేసిన రెండు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. ఆ రోజు షీనా చనిపోయిందని తెలుసున్నప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదన్న దానిపై అతడి వద్ద సమాధానం లేదు. అలాగే హత్య చేస్తుంటే షీనా గొంతు విప్పి ఎందుకు అరవలేదని అడిగినా మౌనమే సమాధానంగా నిలిచింది.
 
ఐతే పోలీసులు సంజీవ్ చెప్పిన వాదనతో ఏకీభవించడంలేదు. డ్రైవర్ రాయ్ విచారణలో చెప్పిన విషయాలనే నమ్ముతున్నారు. హత్యకు ముందు రోజే సంజీవ్ ఇక్కడికి వచ్చాడనీ, ఇద్దరం కలిసి షీనాను హత్య చేశాక మృతదేహాన్ని ఎక్కడ పడవేయాలన్న దాని కోసం స్పాట్ కూడా చూసి వచ్చినట్లు చెప్పాడు. 
 
ఆ క్రమంలో సంజీవ్ రావడం, హత్య చేయడం జరిగిందనీ, ఇది చేసినందుకు తనకు లక్ష రూపాయలు ఇచ్చారనీ, ఇంకా ఎక్కువ మాట్లాడితే షీనా బోరాకు జరిగిందే నీకూ జరుగుతుందని బెదిరించినట్లు డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు చెపుతున్నారు. కాబట్టి సంజీవ్ చెప్పేవన్నీ అవాస్తవాలనీ, నిజమేమిటో తేలాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి