యూరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తాము ఉపేక్షించేది లేదని ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) చీఫ్ రణ్బీర్ సింగ్ వెల్లడించారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల నుంచి తలెత్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని రణ్బీర్ సింగ్ స్పష్టం చేశారు.
బుధవారం రాత్రి కూడా ఉగ్రవాదుల చొరబాటును తిప్పికొట్టినట్లు రణ్బీర్ సింగ్ పేర్కొన్నారు. కాల్పుల ఉల్లంఘన విషయంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తప్పవని రణ్బీర్ సింగ్ హెచ్చరించారు. సరిహద్దుల్లో పాక్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతుందని చెప్పారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. పాక్ ఆర్మీ తమతో సహకరిస్తుందని ఆశించినట్లు తెలిపారు. కానీ అటువైపు నుంచి స్పందన లేదని చెప్పారు.
ఇకపోతే యూరీ, పూంచ్లలో మరణించిన ఉగ్రవాదులు వేలి ముద్రలు, డీఎన్ఏ నమూనాలను పాకిస్థాన్కు అందేజేశామని ఆర్మీ డీజీఎంవో రణబీర్ సింగ్ వెల్లడించారు. భారత్పై ఎలాంటి ఉగ్రదాడులను సహించబోచమని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థావరాలపై దాడులు చేస్తామని చెప్పారు. ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్ర పన్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.