ఇంగ్లండ్ దేశంలో ఉన్నవాళ్లను ఇంగ్లీష్ వాళ్లని... అమెరికాలో ఉండేవారిని అమెరికన్స్ అని... జర్మనీలో ఉండేవారిని జర్మన్స్ అని పిలుస్తున్నప్పుడు... హిందుస్థాన్లో ఉంటున్నవారిని హిందువులు అని పిలిస్తే తప్పేంటని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. అందువల్ల భారత్ ముమ్మాటికీ హిందూ రాజ్యమేనంటూ ఆయన మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈయన గతంలో కటక్లో జరిగిన ఓ సభలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలే చేసిన విషయం తెల్సిందే. ఇండియా అంటే హిందుస్థాన్ అని, హిందూస్థాన్లో ఉండే పౌరులంతా హిందువులు గానే పిలువబడతారని ఆన్నారు. ప్రపంచం అంతా భారతీయులను హిందువులుగానే గుర్తిస్తోందని, అందువల్ల ఇండియా హిందూ దేశమేనని వ్యాఖ్యానించారు. భారతీయులందరి సాంస్కృతిక గుర్తింపు హిందూత్వమే అన్నారు. దేశ వాసులంతా ఈ మహోన్నత సంస్కృతికి వారసులని భగవత్ చెప్పుకొచ్చారు.