#NavyDay : విశాఖ తీరంలో స్వర్ణోత్సవ సంబరాలు

సోమవారం, 4 డిశెంబరు 2017 (09:25 IST)
నేవీ డేను పురస్కరించుకుని తూర్పు తీర నౌకాదళం స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. 1968 మార్చి ఒకటిన విశాఖలో ఆవిర్భవించిన తూర్పునౌకాదళం 2017మార్చి నుంచి 2018 మార్చి ఒకటో తేదీ వరకు స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. 
 
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పండుగల్లో ఏటా డిసెంబరు 4న జరిపే నౌకాదళ దినోత్సవం ప్రధానమైనది. 1971వ సంవత్సరంలో పాకిస్థాన్‌లోని కరాచీ హార్బర్‌పై భారత నౌకాదళ మిసైల్‌బోట్లు పెద్దఎత్తున దాడులు చేసి అతిపెద్ద విజయాన్ని సాధించిపెట్టాయి. తూర్పు నౌకాదళంపై దాడి చేయడానికి విశాఖ తీర సమీపానికి వచ్చిన పాకిస్థాన్‌ నౌకాదళానికి చెందిన పి.ఎన్‌.ఎస్‌.ఘాజీ జలాంతర్గామిని కూడా విజయవంతంగా నిలువరించాయి.
 
తూర్పు తీరంలోని అన్ని ప్రాంతాలు శత్రుదుర్భేద్యంగా ఉంచాలన్న లక్ష్యంతో పశ్చిమబెంగాల్‌ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో పలుచోట్ల వ్యూహాత్మకంగా నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఒక్క విశాఖ తూర్పు నౌకాదళంలోనే సుమారు ఐదు వేల మందికిపైగా నౌకాదళ అధికారులు, ఉద్యోగులు నిత్యం తీరభద్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో తలమునకలై ఉంటారు. 
 
విశాఖ కేంద్రంగా సుమారు 40 వరకు యుద్ధనౌకలు, జలాంతర్గాములను వివిధ ప్రాంతాల్లో మోహరించి భారత తీరాన్ని కాపాడుతుంటారు. తూర్పుతీరం వైపునున్న 18 దేశాలతో తూర్పునౌకాదళం సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళాల్లో ఒకటిగా పలు చిన్నదేశాలకు అండగా నిలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు