బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న మత అసహనంపై కిరణ్ రావు ధైర్యంగా మనస్సులోని మాటను వెల్లడించారంటూ అభినందించారు.
ఇదే అంశంపై ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, తాను కూడా గత కొంత కాలంగా తీవ్ర అసహనంతో ఉన్నట్టు చెప్పారు. తన అసహనంపై భర్తకు చెప్పిన కిరణ్ రావు అభినందనీయురాలన్నారు. ఈ విషయంలో ఆమీర్ ఖాన్ ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ఇదిలావుండగా, ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు అమీర్ ఖాన్ కుటుంబం పాకిస్థాన్కు వెళ్లేందుకు హిందూ సేన టికెట్లు బుక్ చేసినట్టు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ట్వీట్తో పాటు ఆ టికెట్లను కూడా పోస్టు చేశారు. ఈ టికెట్లు అమీర్ ఖాన్, కిరణ్ రావు ఖాన్, ఆజాద్ రావు ఖాన్ల పేరు మీద బుక్ అయినట్టు ఉన్నాయి. అయితే ఈ టికెట్లు ఎవరు తీశారు? అనే విషయం వెల్లడించలేదు.