జయలలితకు తిరుగులేని మెజారిటీ... మూడో రౌండుకు 36 వేల ఓట్ల ఆధిక్యత

మంగళవారం, 30 జూన్ 2015 (11:25 IST)
ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపులో  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విజయపథాన దూసుకుపోతున్నారు. మూడవ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి జయ మెజారిటీ 36 వేలకు పైగా చేరింది. ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమనే విషయం తేటతెల్లమవుతోంది. తమ అధినేత్రి గెలుపు సంబరాలను ఘనంగా జరిపేందుకు తమిళతంబీలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెన్నైలోని ఆమె నివాసం వద్ద సందడి నెలకొంది
 
అంతకు ముందు మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సమయానికి 8632 ఓట్ల మెజారిటీ ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సభ్యత్వం నిమిత్తం పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలి రౌండులో ఆమె 8,632 ఓట్ల ఆధిక్యాన్ని పొందారు. ఈ ఎన్నికల్లో పోటీనే ఉండదనుకుంటే ఏకంగా 28 మంది పోటీలో నిలబడ్డారు. 
 
అయితే జయలలిత తొలి రౌండులోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఆమె సమీప అభ్యర్థులెవరికీ నాలుగంకెల ఓట్లు రాలేదని తెలుస్తోంది. 25 మంది అభ్యర్థులకు పడ్డ ఓట్లు 100కు లోపేనని సమాచారం. ఈ మధ్యాహ్నానికి పూర్తి ఫలితం వెలువడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి