అమ్మ అచేతనంగా కుర్చీలో పడివున్నారు.. పోయెస్‌ గార్డెన్‌లో సీసీటీవీ కెమెరాలున్నా..?

గురువారం, 28 జూన్ 2018 (17:11 IST)
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె వ్యక్తిగత డ్రైవర్ కన్నన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ నమోదైన కేసులు సవాలు చేస్తూ ఆమె సన్నిహితురాలు శశికళ దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా డ్రైవర్ తెలిపారు.

2016 సెప్టెంబర్ 22వ తేదీన అమ్మ గదిలోకి వెళ్లేటప్పుడు ఆమె అచేతనంగా కుర్చీలో పడి వున్నారని.. పక్కనే కొన్ని ఫైల్స్‌, మూత లేని పెన్‌ ఉన్నాయని తెలిపారు. వెంటనే చిన్నమ్మ(శశికళ) ఒక ఛైర్‌ తీసుకు రమ్మని, అమ్మను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని తనతో చెప్పారన్నాడు.
 
కానీ శశికళ, డా. శివకుమార్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో జయలలిత బెడ్‌ మీద కూర్చొని ఉండగా, స్పృహ కోల్పోయి పడిపోయినట్లు... పీఎస్‌, డ్రైవర్‌ ఆమెను బెడ్‌మీద నుంచి చైర్‌లోకి మార్చినట్లు చెప్పారు. కానీ సెప్టెంబర్‌ 22న రాత్రి 9:30గంటలకు అంబులెన్స్‌లో జయలలితను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు, డా.శివకుమార్‌, శశికళ ఇద్దరూ జయతో వెళ్లినట్లు పేర్కొన్నారు.
 
అయితే డ్రైవర్ మాత్రం అమ్మ పీఎస్‌ఓ వీర పెరుమాళ్‌‌తో కలిసి అమ్మను ఛైర్లోకి మార్చడం చేశామని.. రెండు అడుగులు వేయగానే అమ్మ పడిపోతుండటంతో అక్కడే ఆపేసి స్ట్రెచర్‌ తీసుకు వస్తే మంచిదని ఆలోచించామన్నాడు. రాత్రి పది గంటలకు పెద్దకారు తీసుకొచ్చామని.. ఈ ఘటన జరగడానికి గంట ముందు అంటే అదే రోజు రాత్రి 8:30గంటలకు డా. శివకుమార్‌ పోయెస్‌ గార్డెన్‌లో ఉండటం తాను చూశానన్నాడు. 
 
కానీ గంటపాటు ఆయన కన్పించలేదు. తర్వాత తాను అమ్మ గదిలోకి వెళ్లేసరికి శివకుమార్‌ అక్కడే ఉన్నారు. దాదాపు 9:30 ప్రాంతంలో ఆయన అమ్మ గదిలోకి వచ్చి ఉండొచ్చునని చెప్పారు. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లేటపుడు ఆమెతోపాటు చిన్నమ్మ, పీఎస్‌వో వీరపెరమాళ్‌ మాత్రమే వెళ్లారు. పోయెస్‌ గార్డెన్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ సెప్టెంబర్‌ 22న జరిగిన ఈ ఘటనంతా రికార్డయ్యిందో లేదో తెలియదని కన్నన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు