జయలలితకు భారతరత్న పురస్కారమా? నవ్వొస్తుంది : పీఎంకే నేత అన్బుమణి

శుక్రవారం, 23 డిశెంబరు 2016 (11:05 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం పొందే అర్హత లేదని పీఎంకే నేత, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ వ్యాఖ్యానించారు. 15 అవినీతి కేసులను జయలలిత ఎదుర్కొని, జైలు జీవితం కూడా గడిపారని ఆయన గుర్తు చేశారు. పైగా... ఆమెను నిర్దోషిగా ప్రకటించిన కేసుకు సంబంధించిన అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు 
 
ఈనెల 5వ తేదీన మరణించిన జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ అన్నాడీఎంకే ప్రభుత్వం మంత్రివర్గం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెల్సిందే. దీనిపై అన్బుమణి రాందాస్ పై విధంగా స్పందించారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో శూన్యత ఏర్పడిందని... మరో నలుగేళ్లపాటు పార్టీని అధికారంలో నిలపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. శశికళకు ఏమాత్రం ప్రజామద్దతు లేదని అన్నారు. తన రాజకీయ వారసురాలిగా శశికళను జయలలిత ఏనాడూ ప్రకటించలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి